“మంత్రి సీతక్క చొరవతో పెరిగిన బెనిఫిట్స్
60 ఏళ్లు దాటిన వారికీ వర్తింపు
2,572 మంది ఖాతాల్లో నిధుల జమ
రూ.15.61 కోట్ల సాయం అందజేత
హైదరాబాద్, గస్టు17(మనప్రజాప్రతినిధి): అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమలు చేస్తోంది. మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక చొరవతో అంగన్వాడీ సిబ్బందికి పదవీ విరమణ అనంతరం అందించే సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ను గణనీయంగా పెంచింది. 65 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసిన వారితో పాటు, 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగినా పెంచిన ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం ఉత్తర్వులు అమలు చేస్తోంది. గతంలో 2023 ఉత్తర్వుల ప్రకారం అంగన్వాడీ టీచర్లకు రూ.1 లక్ష, హెల్పర్లు మరియు మినీ అంగన్వాడీ వర్కర్లకు రూ.50 వేల సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ మాత్రమే అందేవి. అయితే 2025 మే 30న ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ మొత్తాలను రెట్టింపు చేసింది. తాజా నిబంధనల ప్రకారం పదవీ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు.
అంతేకాకుండా 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు స్వచ్ఛందంగా విధుల నుంచి తప్పుకున్నా అదే స్థాయిలో వాలంటరీ డిస్ఎంగేజ్మెంట్ బెనిఫిట్ పొందే అవకాశం కల్పించారు. దీర్ఘకాలంగా సేవలందించిన సిబ్బందికి గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వడంతో పాటు భవిష్యత్ జీవనానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ నిర్ణయం లక్ష్యమని అధికారులు తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,572 మంది అంగన్వాడీ సిబ్బంది ఖాతాల్లో మొత్తం రూ.15.61 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఇందులో 473 మంది అంగన్వాడీ టీచర్లకు రూ.4.73 కోట్లు, 1,930 మంది అంగన్వాడీ హెల్పర్లకు రూ.9.65 కోట్లు చెల్లించారు. దీంతో వేలాది మంది అంగన్వాడీ సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించినట్లు అధికారులు పేర్కొన్నారు.
పెంచిన బెనిఫిట్స్ అమలులో భాగంగా మరో 14 మంది అంగన్వాడీ టీచర్లకు రూ.28 లక్షలు, 59 మంది హెల్పర్లకు రూ.59 లక్షలు చెల్లించారు. అదేవిధంగా పాత నిబంధనల ప్రకారం అర్హత సాధించిన 96 మంది అంగన్వాడీ సిబ్బందికి రూ.36.10 లక్షలు అందజేశారు. పదవీ విరమణ చేసిన సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నేరుగా వారి ఖాతాల్లోనే నిధులు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ చేసిన అంగన్వాడీ సిబ్బందికి కూడా ఈ ప్రభుత్వం బకాయి ప్రయోజనాలను చెల్లించినట్లు అధికారులు తెలిపారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం, భవిష్యత్లోనూ వారి సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం గౌరవప్రదమైన జీవితం గడపడానికి అవసరమైన ఆర్థిక భరోసా కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.