manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 12 November 2025, 11:17 am Editor : MANA PRAJA PRATINIDHI

భూటాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం 

భూటాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

– భారత్–భూటాన్ మైత్రి బంధానికి కొత్త ఊపు

భూటాన్, నవంబర్ 11 : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూటాన్ పర్యటనకు చేరుకున్నారు. భూటాన్‌లోని పారో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే భూటాన్ ప్రధాన మంత్రి షేరింగ్ టోబ్గే స్వయంగా ఆయనను ఆత్మీయంగా స్వాగతించారు. రెండు దేశాల జెండాలు రెపరెపలాడుతుండగా, గౌరవ వందనాలతో మోదీకి రాజసమాన ఆతిథ్యం అందించారు. భూటాన్ ప్రజలు సాంప్రదాయ దుస్తుల్లో రోడ్ల వెంట నిలబడి “లాంగ్ లివ్ ఇండియా–భూటాన్ ఫ్రెండ్షిప్” అంటూ హర్షధ్వానాలు చేశారు.

భారత్–భూటాన్ స్నేహ సంబంధాలను కొత్త దిశగా తీసుకెళ్లే ఈ పర్యటనలో మోదీ పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా భూటాన్ నాలుగో రాజు మహారాజా జిగ్మే సింగే వాంగ్‌చుక్ 70వ జన్మదిన వేడుకలకు హాజరవ్వడం ఈ పర్యటనకు అంతర్జాతీయ ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది. ఆయనకు అంకితభావంతో పాలన సాగించిన మహారాజా స్ఫూర్తిగా నిలుస్తారని మోదీ పేర్కొననున్నట్లు సమాచారం.

ఇక ఈ పర్యటనలో ఆర్థిక, విద్య, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో భారత్–భూటాన్ మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఎడ్యుకేషన్, యూత్ ఎక్స్చేంజ్ వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయని వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన రెండు దేశాల భవిష్యత్ సంబంధాలకు కొత్త దశ ఆరంభమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భూటాన్ పర్యటన సందర్భంగా మోదీ భూటాన్ రాజ కుటుంబాన్ని, ప్రభుత్వ ప్రతినిధులను, అలాగే భారతీయ సమాజ సభ్యులను కూడా కలవనున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ఆయన, భారత్‌ సహకారంతో నిర్మితమవుతున్న పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సమీక్షించనున్నారు.

భూటాన్ ప్రజలు భారత ప్రధాని పర్యటనను పండుగలా జరుపుకుంటున్నారు. పారో, థింఫూ వీధులన్నీ భారత జెండాలతో అలంకరించబడ్డాయి. భూటాన్ మీడియా కూడా ఈ పర్యటనను చారిత్రాత్మకంగా అభివర్ణిస్తోంది.