manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 17 November 2025, 4:12 pm Editor : Mana Praja Prathinidhi

కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లు వేగవంతం

– మంత్రి కొండ సురేఖ అధికారి సమీక్ష
– వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని శాఖలకు సమన్వయ ఆదేశాలు
– భద్రత, రవాణా, నీరు, పారిశుద్ధ్యం – ప్రాధాన్య అంశాలు
– జాతర ప్రారంభానికి ముందే అన్నీ పనులు పూర్తి చేయాలన్న స్పష్టమైన సూచనలు

సిద్ధిపేట, నవంబర్ 17 (మనప్రజాప్రతినిధి):
రాబోయే కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణం మరియు జాతరను అత్యంత వైభవంగా, శ్రద్ధాభక్తులతో నిర్వహించేందుకు అన్ని విభాగాలు సిద్ధంగా ఉండాలని మంత్రి కొండ సురేఖ స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా ఎండోమెంట్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె, జాతరకు లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలంటూ సూచనలు జారీ చేశారు. భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని రోడ్డు మార్గాలను మెరుగుపర్చడం, ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం అత్యవసరమని ఆమె పేర్కొన్నారు. జాతర కాలంలో భద్రతా చర్యల పర్యవేక్షణ కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్ వంటి సేవల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని, ప్రతి అంశానికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని సూచించారు.
ఆలయాభివృద్ధికి సంబంధించిన పనులను పరిశీలించిన మంత్రి, పెండింగ్‌లో ఉన్న రహదారుల అభివృద్ధి, విద్యుత్ లైటింగ్, డ్రైనేజ్ సదుపాయాలను తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. జాతర ప్రారంభానికి ముందే అన్ని పనులు పూర్తవ్వాలని స్పష్టమైన గడువు విధించారు. భక్తులకు క్యూ లైన్లలో నీడ సదుపాయాలు, వైద్య సేవలు, అత్యవసర సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జాతర సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యకలాపాలు నిర్వహించే వాలంటీర్లతో కూడిన ప్రత్యేక బృందాలను సమన్వయంతో పనిచేయేలా సూచించారు. భక్తుల ఆరోగ్య భద్రత కోసం వైద్య బృందాలు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉండాలని, జాతర ప్రాంతంలో బోర్డులు, గైడెన్స్ మ్యాప్‌లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. కొమురవెల్లి మల్లన్న జాతర రాష్ట్రంలో అత్యంత రద్దీ జాతరల్లో ఒకటైనందున, భక్తుల విశ్వాసానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో పని చేయాలని కొండ సురేఖ పునరుద్ఘాటించారు.