manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 25 November 2025, 8:21 am Editor : Mana Praja Prathinidhi

బ్లూ డ్రమ్ హత్య కేసు నిందితురాలు ముస్కాన్ బిడ్డకు జన్మనిచ్చింది

జైలులో ఉన్న సమయంలోనే గర్భవతిగా తేలిన ముస్కాన్
భర్తను హత్య చేసి డ్రమ్‌లో దాచిన కేసు దేశాన్ని కుదిపేసింది
కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం

లక్నో, 25నవంబర్ (మనప్రజాప్రతినిధి):
దేశాన్ని కలచివేసిన మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో నిందితురాలు ముస్కాన్ తాజాగా బిడ్డకు జన్మనిచ్చింది. అరెస్ట్‌ తర్వాత సాధారణ వైద్య పరీక్షల్లో ఆమె గర్భవతిగా ఉన్న విషయం బయటపడగా, సోమవారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో జైలు అధికారులు వెంటనే భద్రతను కట్టుదిట్టం చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ముస్కాన్ సురక్షితంగా బిడ్డకు జన్మనిచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంవత్సరం మార్చి 3న ముస్కాన్ రస్తోగి తన ప్రియుడు సాహిల్‌తో కలిసి భర్త సౌరభ్‌ను హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో పెట్టి, సిమెంట్‌తో నింపి దాచిపెట్టే ప్రయత్నం చేశారు. అనంతరం సిమ్లాకు వెళ్లి ఆనందంగా గడిపిన ఈ జంట మార్చి 17న మీరట్‌కు తిరిగి వచ్చినప్పుడు డ్రమ్‌ను పారవేయబోయే ప్రయత్నంలో హత్య చరిత్ర బయటపడింది. వెంటనే పోలీసులు ముస్కాన్, సాహిల్‌లను అరెస్ట్ చేశారు.
జైలులో ఏప్రిల్‌లో నిర్వహించిన సాధారణ ఆరోగ్య పరీక్షల్లో ముస్కాన్ గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. ఆమె ప్రియుడు సాహిల్ ద్వారానే గర్భం దాల్చినట్లు దర్యాప్తులో తెలిసింది. నెలలు నిండడంతో సోమవారం ఆమెకు ప్రసవ వేదనలు వచ్చాయి. అధికారులు వెంటనే స్పందించి కట్టుదిట్టమైన భద్రతలో ఆసుపత్రికి తరలించగా, ఆమె ఆరోగ్యంగా బిడ్డకు జన్మనిచ్చినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.