– భక్తుల దర్సనానికి మరిన్ని సౌకర్యాలు
– ₹45 లక్షలతో వంతెన నిర్మాణానికి పునాది
– మేడారం మహా జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు
ములుగు, 16 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
గట్టమ్మ దేవాలయ దర్శనం భక్తులకు మరింత సుఖంగా, సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఇకపై ఎలాంటి తొందరపాటు లేకుండా భక్తులు అమ్మవారి దర్సనం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, అనంతరం మేడారం వైపు ప్రయాణం కొనసాగించేలా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోందని ఆమె అన్నారు.₹45 లక్షల నిధులతో గట్టమ్మ ఆలయం సమీపంలో నిర్మించనున్న వంతెనకు మంత్రి సీతక్క భూమిపూజ నిర్వహించారు. ఈ వంతెన వల్ల భక్తుల రాకపోకలు సులభతరం కానున్నాయని ఆమె వెల్లడించారు.మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. పనుల నాణ్యత, వేగం, సమయపాలనపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు.మేడారం మహా జాతరకు ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, పుణ్యక్షేత్రాన్ని అద్భుతమైన తీర్థస్ధలంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.