manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 11:16 am Posted by : Mana Praja Prathinidhi

కోటి మహిళలకు నాణ్యమైన చీరలు అందించే ప్రభుత్వ లక్ష్యం

నల్గొండలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రారంభం
మహిళా గౌరవం, శక్తివంతత కోసం కీలక కార్యక్రమం
ఉదయాదిత్య భవన్‌లో చీరలు అందజేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్గొండ, 22 నవంబర్ (మనప్రజాప్రతినిధి):

నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని మహిళలకు చీరలను స్వయంగా అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమం విస్తృత గుర్తింపు పొందుతోంది. తెలంగాణలో మొత్తం 1 కోటి 15 లక్షల కుటుంబాలు ఉన్నాయని, అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ శనివారం నుంచి భారీ స్థాయిలో పంపిణీ ప్రారంభించిందని మంత్రి వివరించారు. ప్రతి మహిళకు గౌరవం, ఆత్మవిశ్వాసం కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ చీరల పంపిణీ కార్యక్రమం మహిళల శక్తివంతత, సామాజిక స్థాయి పెరుగుదల దిశగా కీలక అడుగుగా నిలుస్తుందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, స్వయం సహాయక బృందాల సభ్యులు, గృహిణులకు ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రయోజనాలు అందిస్తుందని ఆయన తెలిపారు.

మహిళల అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతి అనే దృష్టితో ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి అన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తిస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయనున్నట్టు సూచించారు.