manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 8:06 am Editor : MANA PRAJA PRATINIDHI

కేటీఆర్ వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం

– బహిరంగ విమర్శలు కాదు చట్టబద్ధ మార్గం తప్పనిసరి
– డీజీపీ శివధర్ రెడ్డికి సంఘం పూర్తి మద్దతు
– అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: హెచ్చరిక

(హైదరాబాద్‌, నవంబర్‌ 13) (మనప్రజాప్రతినిధి): మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మరియు మొత్తం పోలీస్‌ వ్యవస్థపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సంఘం “అవమానకరమైనవి, బాధ్యతారాహిత్యమైనవి” అని ఖండించింది. డీజీపీపై వ్యక్తిగత దూషణలు చేయడం అసంభవమని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. ఒక టెలివిజన్‌ ఇంటర్వ్యూలో కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఐపీఎస్ అధికారుల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. “డీజీపీ మరియు మొత్తం రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని చేసిన వ్యాఖ్యలు, ప్రజల్లో తప్పుదారితప్పే అభిప్రాయాలను కలిగిస్తాయి. ఇది పోలీసుల వృత్తి నిష్పాక్షికతకు, గౌరవానికి భంగం కలిగించే చర్య” అని పేర్కొంది. సంఘం తన ప్రకటనలో స్పష్టంచేసింది: “పోలీస్ వ్యవస్థపై నిజమైన అభ్యంతరాలు ఉంటే, వాటిని చట్టబద్ధంగా లేవనెత్తాలి. బహిరంగంగా దూషించడం ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధం. రాజ్యాంగ సంస్థలపై నిరాధార వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు.” డీజీపీ రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థకు అధిపతి. అలాంటి వ్యక్తిపై వ్యక్తిగత లేదా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు అనుచితం” అని సంఘం పేర్కొంది. తెలంగాణ పోలీసులు ఎల్లప్పుడూ చట్టబద్ధంగా, నిష్పాక్షికంగా పనిచేస్తున్నారని, సీనియర్ ప్రభుత్వ అధికారుల గౌరవాన్ని రాజకీయ వేదికల్లో దెబ్బతీయకూడదని హెచ్చరించింది.