manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 7:53 am Editor : MANA PRAJA PRATINIDHI

మళ్లీ చర్చలోకి ప్రధాని మోదీ డిగ్రీ వివాదం

  •  ఢిల్లీ యూనివర్సిటీకి హైకోర్టు మూడు వారాల గడువు
  • సీఐసీ ఆదేశాలపై అప్పీలు, జనవరి 16న తదుపరి విచారణ పారదర్శకత,
  • ప్రజా ఆసక్తిపై వాదనలు మళ్లీ వేడెక్కనున్నాయి

(న్యూఢిల్లీ, నవంబర్ 13) (మనప్రజాప్రతినిధి): ప్రధాని నరేంద్ర మోదీ విద్యా అర్హతలపై కొనసాగుతున్న చట్టపరమైన వివాదం మరోసారి దేశ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాని మోదీ బ్యాచిలర్ డిగ్రీ వివరాలను బహిర్గతం చేయాలన్న పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తమ అభ్యంతరాలను సమర్పించడానికి ఢిల్లీ యూనివర్సిటీకి మూడు వారాల గడువు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ దేవేందర్ కుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ తుషార్ రావు గేదెలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు వెలువరించింది. ఆగస్టులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై వేసిన అప్పీల్ ఆలస్యం అవుతున్నదని కోర్టు గమనించింది. ఢిల్లీ యూనివర్సిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసుపై తదుపరి విచారణను 2026 జనవరి 16వ తేదీకి వాయిదా వేసినట్లు హైకోర్టు ప్రకటించింది.
– సీఐసీ ఆదేశాలపై వివాదం
ప్రధాని మోదీ డిగ్రీ వివరాలను బహిర్గతం చేయాలన్న సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (CIC) ఆదేశాలను ఆగస్టు 25న సింగిల్ జడ్జి పక్కనపెట్టారు. ఆ తీర్పును సవాల్ చేస్తూ మొత్తం నాలుగు అప్పీలు హైకోర్టులో దాఖలయ్యాయి. ఆర్టీఐ కార్యకర్త నీరజ్‌, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్‌, అడ్వకేట్ మొహమ్మద్ ఇర్షద్‌ల పిటిషన్లను ధర్మాసనం ప్రస్తుతం విచారిస్తోంది.
– పారదర్శకత వర్సెస్ వ్యక్తిగత హక్కులు
ఆగస్టు తీర్పులో సింగిల్ జడ్జి “ప్రజా ఆసక్తికన్నా పారదర్శకత ముఖ్యమైనదే కాని, వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం వల్ల సెన్సేషన్ సృష్టించడం ఉద్దేశం కాదు” అని వ్యాఖ్యానించారు. అయితే, ఆర్టీఐ కార్యకర్తల వాదన ప్రకారం, ప్రధానమంత్రి వంటి ప్రజాప్రతినిధుల విద్యార్హతలు ప్రజలకు తెలియాల్సిన అంశమని అంటున్నారు. 2016 డిసెంబర్ 21న సీఐసీ, 1978లో బీఏ పాసైన వారి రికార్డులను పరిశీలించాలన్న ఆదేశాలు జారీ చేయగా, అదే ఏడాది మోదీ తన డిగ్రీ పూర్తిచేసినట్లు రికార్డుల్లో ఉంది.