manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 7:56 am Editor : MANA PRAJA PRATINIDHI

దేశ భద్రతపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి

– ఇంటెలిజెన్స్‌, భద్రతా బలగాలకు పవన్‌ కళ్యాణ్‌ కృతజ్ఞతలు
– విజ్ఞానగరం ఉగ్ర కుట్రను అడ్డుకున్న ఎన్ఐఏ కృషిని ప్రశంస
– దేశ భద్రత ప్రభుత్వ బాధ్యత కాదు.. ప్రతి పౌరుడి ధర్మం
– ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

(అమరావతి, నవంబర్‌ 13) (మనప్రజాప్రతినిధి): జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ దేశ భద్రతా బలగాలకు గాఢమైన కృతజ్ఞతలు తెలిపారు. దేశాన్ని నిశ్శబ్దంగా కాపాడుతున్న ఇంటెలిజెన్స్‌ మరియు సెక్యూరిటీ ఫోర్సులే నిజమైన వీరులు అని పేర్కొన్నారు. ఇటీవల 2,900 కిలోల పేలుడు పదార్థాలు, రైఫిల్‌ గిడ్డంగులు, రిసిన్‌ టాక్సిన్‌ వంటి ప్రమాదకర పథకాలను అడ్డుకోవడంలో భద్రతా సంస్థలు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. “ఉగ్రవాద మూలాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇవి దూర ప్రాంతాల సమస్యలు కావు; మన ఊర్లు, మన పట్టణాల వరకూ చేరుతున్నాయి” అన్నారు. ఇటీవల విజ్ఞానగరం జిల్లా నుండి ఉద్భవించిన ఐసిస్‌ సిద్ధాంతానికి అనుసంధానమైన ఉగ్ర పథకాన్ని ఎన్ఐఏ, ఇతర భద్రతా సంస్థలు అడ్డుకున్నాయని తెలిపారు. ఆ కుట్ర ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుందని, సమయానికి చర్యలు తీసుకోవడంతో పెద్ద ముప్పు తప్పిందని అన్నారు. దేశ భద్రత కేవలం కేంద్ర ప్రభుత్వ బాధ్యత కాదు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి శాఖ, ప్రతి గ్రామ పంచాయతీ నుంచి జాతీయ రాజధాని వరకు అందరికీ ఇది పంచుకున్న బాధ్యత” అని పవన్‌ స్పష్టం చేశారు. “ప్రాంతీయ పార్టీలు జాతీయ భద్రతను పక్కన పెట్టకూడదు. రాజకీయాల కంటే దేశ రక్షణే ప్రథమం కావాలి” అని అన్నారు. రాడికలైజేషన్‌ మన వీధుల్లో, మన కాలనీల్లో జరుగుతోంది. అందుకే ప్రతి విద్యాసంస్థ, ప్రతి కార్యాలయం, ప్రతి మత సంస్థ ఒక రక్షణ కోటలా మారాలి” అని పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు. “దేశాన్ని విభజించే రాజకీయ మాయాజాలాలకు లోనవ్వకండి. మతం, భాష, ప్రాంతం అనే పేరుతో మన మధ్య చీలికలు సృష్టించే వారిని జాగ్రత్తగా గమనించండి. మనమందరం ముందు భారతీయులం దేశ రక్షణే మన ధర్మం” అని ఆయన స్పష్టం చేశారు.