manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 9:23 am Posted by : Mana Praja Prathinidhi

షూటింగ్‌లో గాయపడిన శ్రద్ధా..

ముంబై, నవంబర్ 24, మనప్రజాప్రతినిధి:

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సినిమా షూటింగ్ సమయంలో గాయపడడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఈతా’ జీవితకథా చిత్రీకరణ నాసిక్‌లో జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పాట చిత్రీకరిస్తుండగా నౌవారీ చీరతో పాటు భారీ ఆభరణాలు ధరించి వేగంగా నృత్యం చేస్తుండగా బ్యాలెన్స్ కోల్పోయి పడిపోయింది. దాంతో ఆమె ఎడమ కాలికి గాయమై స్వల్ప ఫ్రాక్చర్ వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు.
ఈ విషయంపై శ్రద్ధా స్వయంగా స్పందిస్తూ… “పెద్దగా భయపడాల్సిన విషయం ఏమీ కాదు. కండరానికి దెబ్బ తగలడంతో చిన్నగా ఎముకకు పగిలింది. వైద్యులు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నేను క్షేమంగా ఉన్నాను. త్వరలోనే మళ్లీ షూటింగ్‌కు హాజరవుతాను” అని అభిమానులకు భరోసా ఇచ్చింది.
గాయంతో వెంటనే ఆమెను ముంబైకి తరలించగా, అక్కడ చికిత్స కొనసాగుతోంది. మొదట భావోద్వేగ సన్నివేశాల చిత్రీకరణకు హాజరవ్వాలని ప్రయత్నించినప్పటికీ, నొప్పి ఎక్కువగా ఉండడంతో చిత్రబృందం తాత్కాలికంగా షూటింగ్ నిలిపివేసింది. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత మరో రెండ్రోజుల వారాల్లో తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నట్టు యూనిట్ వర్గాలు తెలిపాయి.
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమాషా కళాకారిణి విఠాబాయి నారాయణగావ్కర్ జీవితం ఆధారంగా రూపొందుతోంది. ఈ పాత్ర కోసం శ్రద్ధా దాదాపు పదిహేను కిలోల బరువు పెరిగినట్లు కూడా పరిశ్రమలో చర్చ సాగుతోంది. ‘తమాషా సామ్రాజ్ఞి’గా పేరొందిన విఠాబాయికి ఆమె సేవలకుగాను రాష్ట్రపతి పురస్కారాలు కూడా లభించిన విషయం తెలిసిందే.
ఇలా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం శ్రద్ధా అభిమానులను కొంత కలవరపెట్టినప్పటికీ, ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్టు కుటుంబ సభ్యులు, సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.