manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 23 November 2025, 2:41 pm Editor : Mana Praja Prathinidhi

తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్ సైబర్ నేరగాళ్ల కొత్త పన్నాగం

– ఎస్‌బీఐ కేవైసీ పేరుతో అపాయ ఏపీకే ఫైళ్లు షేర్
– మంత్రులు, పీఆర్వోలు, జర్నలిస్టుల ఫోన్లు టార్గెట్
– అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైమ్ హెచ్చరిక

హైదరాబాద్, 23 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
తెలంగాణ మంత్రులు, సీఎంవో, డిప్యూటీ సీఎం అధికారిక వాట్సాప్ గ్రూపులు సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా మారాయి. ఎస్‌బీఐ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైళ్లను గ్రూపుల్లో షేర్ చేస్తూ, వాటిని ఓపెన్ చేస్తే ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యేలా పన్నాగం పన్నుతున్నట్లు సమాచారం.మంత్రుల అధికారిక గ్రూపులతో పాటు పీఆర్వోలు, మీడియా గ్రూపుల్లోనూ ఇదే విధంగా ఏపీకే ఫైళ్లు పంపబడుతున్నాయి. జర్నలిస్టుల ఫోన్లు కూడా ప్రభావితమయ్యాయనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రూపుల్లోకి APK ఫైళ్లు ప్రవేశించడం ఆందోళన కలిగించే విషయం అని అధికారులు భావిస్తున్నారు.
ఈ ఘటన వెలుగులోకి రాగానే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏ విధమైన ఏపీకే ఫైళ్లు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దని స్పష్టం చేశారు. అనుమానాస్పద లింకులు, కేవైసీ అప్‌డేట్ పేరుతో వచ్చే మెసేజ్‌లు క్లిక్ చేస్తే డేటా దొంగిలింపు ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇటువంటి సైబర్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు, అధికారులకు సూచించారు.ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.