manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 2:49 pm Editor : Mana Praja Prathinidhi

కుప్పంలో ‘1.5 మ్యాటర్స్’ క్లైమేట్ యాక్షన్ ఉద్యమానికి నాంది

యువత కోసం 1M1B గ్రీన్ ఇంటర్న్‌షిప్ ప్రకటించిన భువనేశ్వరి
స్థిరమైన అభివృద్ధి, సాంకేతిక నైపుణ్యాలకు ప్రోత్సాహం
యువత భవిష్యత్తు నిర్మాణంలో కీలక అవకాశాలు

కుప్పం, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):

ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన సంస్థ వన్ మిలియన్ వన్ బిలియన్ బృందంతో సంభాషించడం ఆనందమేసిందని నారా భువనేశ్వరి తెలిపారు. కుప్పంలో ‘1.5 మ్యాటర్స్’ క్లైమేట్ యాక్షన్ ఉద్యమాన్ని ప్రారంభించడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ కార్యక్రమం కుప్పం నుంచి ఆరంభమవడం విశేషమన్నారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నివారణ పై యువతలో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ ఉద్యమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల పాల్గొనడం, శిక్షణ కార్యక్రమాలు, స్థానిక స్థాయిలో పర్యావరణ చర్యలు ఈ ఉద్యమంలో భాగంగా ఉంటాయి.
ఈ కార్యక్రమం సందర్భంగా కుప్పంలో వన్ మిలియన్ వన్ బిలియన్ గ్రీన్ ఇంటర్న్‌షిప్ను కూడా నారా భువనేశ్వరి ప్రకటించారు. ఏఐసీటీఈ, సేల్స్‌ఫోర్స్ సహకారంతో అందిస్తున్న ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా యువతకు స్థిరమైన అభివృద్ధి (సస్టైనబిలిటీ), హరిత సాంకేతికత, నూతన డిజిటల్ నైపుణ్యాలపై ప్రత్యక్ష అనుభవం లభించనుంది. “ఆంధ్రప్రదేశ్ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని సమాజానికి ఉపయోగపడే విజయవంతమైన కెరీర్‌లు నిర్మించాలి” అని భువనేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. వన్ మిలియన్ వన్ బిలియన్ బృందం చేస్తున్న సేవలు దేశ భవిష్యత్తుకు దోహదం చేస్తాయని ఆమె అభినందించారు.