manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 9:27 am Editor : Mana Praja Prathinidhi

టమాటా ధరలు భగ్గుమంటూ..

తెలంగాణ మార్కెట్లలో కేజీ ఎనభై రూపాయలు

హైదరాబాద్‌, నవంబర్‌ 24,మనప్రజాప్రతినిధి:

రాష్ట్రవ్యాప్తంగా టమాటా ధరలు ఒక్కసారిగా కొండెక్కి సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు కిలోకు ఇరవై నుంచి నలభై రూపాయల మధ్య లభించిన టమాటా ధరలు ఇప్పుడు అరవై నుంచి ఎనభై రూపాయల వరకు చేరిపోయాయి. కరీంనగర్, రాయదుర్గం, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన మార్కెట్లతో పాటు నగరాల్లోని రిటైల్ కూరగాయల దుకాణాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రోజువారీ వంటలో తప్పనిసరిగా ఉపయోగించే టమాటా ఇంత ఖరీదుగా మారడంతో గృహిణులు కొనుగోలును తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సరఫరా తీవ్రంగా తగ్గిపోవడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన తుపాను, అనంతరం కురిసిన భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో టమాటా పంటకు తీవ్ర నష్టం జరిగింది. పొలాల్లో నీరు నిలిచిపోవడం, మొక్కలు కుళ్లిపోవడం, తెగుళ్ల బెడద పెరగడం కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో మార్కెట్లకు చేరాల్సిన సరఫరా బాగా తగ్గిపోయింది.
మరోవైపు డిమాండ్ మాత్రం యథావిధిగా కొనసాగుతుండటంతో సరఫరా–డిమాండ్ మధ్య అంతరం పెరిగింది. ఈ పరిస్థితిని గమనించిన కొంతమంది దళారులు, వ్యాపారులు నిల్వలు చేసుకుని ధరలను మరింత పెంచుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రిటైల్ మార్కెట్లలో టమాటా పరిమితంగా మాత్రమే లభ్యమవుతుండటంతో ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేయలేని స్థితి నెలకొంది.
వ్యాపార వర్గాల అంచనా ప్రకారం, మరో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. కొత్తగా పంట చేతికి వచ్చే వరకు ధరలు తగ్గే సూచనలు కనపడడం లేదని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు టమాటాకు బదులుగా ఇతర కూరగాయల వైపు మొగ్గు చూపుతూ కుటుంబ ఖర్చులను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అధికారులు కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తూ, మార్కెట్‌లలో ధరల నియంత్రణకు చర్యలు తీసుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.