– హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తల దాడి
– బాలకృష్ణపై వ్యాఖ్యలతో ప్రాంతంలో ఉద్రిక్తత
– బాలయ్య జోలికి వస్తే ఎవరినీ వదలం : ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు హెచ్చరిక
హిందూపురం, 17 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
హిందూపురం ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణపై కొందరు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయంపై దాడి చేయగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ వ్యవహారంపై శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాను బాలయ్యకు అభిమానిగా మాట్లాడుతున్నానని చెప్పిన ఎమ్మెల్యే రాజు, “బాలయ్య జోలికి వస్తే చర్మం ఒలిచేస్తాం. హిందూపురంలో కొందరు చిల్లర వెధవలు బాలకృష్ణ గురించి మాట్లాడటంతో మా కార్యకర్తలు ఆవేశాన్ని చూపారు. ఇది మీకూ, మీ అధినేతకూ హెచ్చరిక” అని స్పష్టం చేశారు. బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలే ఈ వివాదానికి మూలమని ఆయన పేర్కొన్నారు. హిందూపురంలో వైసీపీ కార్యాలయం, పార్టీ ఇన్ఛార్జ్ దీపికా రెడ్డి భర్త కార్యాలయంపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ వివాదం రాజకీయం మరోసారి హాట్ టాపిక్గా మారింది.