manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 10 December 2025, 1:52 pm Editor : Mana Praja Prathinidhi

పెట్రోల్ బంకుల్లో మౌలిక వసతులు తప్పనిసరి : జిల్లా పౌరసరఫరాల అధికారి పి. నిత్యానందం

మనప్రజాప్రతినిధి,మెదక్ జిల్లా.చేగుంట,డిసెంబర్10
ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రతి పెట్రోల్ బంకులో మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలని జిల్లా పౌరసరఫరాల అధికారి పి. నిత్యానందం బంక్ నిర్వాహకులకు సూచించారు. బుధవారం మెదక్ పట్టణంలోని శ్రీనివాస పెట్రోల్ బంక్‌పై ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.తనిఖీ సమయంలో ఇంధన కొలతలు, నాణ్యత, ధరల ప్రదర్శన, భద్రతా ప్రమాణాలు, తాగునీరు, టాయిలెట్, ఫస్ట్ ఎయిడ్, టైర్లకు ఉచిత గాలి వంటి కనీస సదుపా యాల స్థితిని పరిశీలించారు. ఈ తనిఖీలో ఇంధన కొలతల్లో తేడాలు, ఫిల్టర్ పేపర్ పరీక్షలో అనుమానాస్పద ఫలితాలు, మౌలిక సదుపా యాల లేమి వంటి పలు లోపాలు బయటపడ్డాయి.ఈ సందర్భంగా అధికారి నిత్యానందం మాట్లాడుతూ“ఖచ్చితమైన కొలతలు, నాణ్యతా ప్రమాణాలను పాటించడం పెట్రోల్ బంక్ నిర్వాహకుల చట్టబద్ధ బాధ్యత. వినియోగదారులను మోసం చేసే చర్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది ”అనిహెచ్చరించారు. బంక్‌పై ప్రాథమిక కేసు నమోదు చేసి, చట్టపరమైన వివరణ కోరినట్లు తెలిపారు. అవసరమైతే బంక్‌ను సీజ్ చేయడం సహా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇంధన నాణ్యత లేదా కొలతపై సందేహాలుంటే వినియోగదారులు బంక్‌లో ఉన్న అధికారిక కొలత–క్వాలిటీ చెక్ పరికరాలను చూపించాల్సిందిగా డిమాండ్ చేయవచ్చని, సహకరించని బంకులపై వెంటనే పౌరసరఫరాలు / లీగల్ మెట్రాలజీ శాఖలకు ఫిర్యాదు చేయాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధ నలుఉల్లంఘించే బంకులపై ఎటువంటి కనికరం చూపబోమని అధికారి నిత్యానందం హెచ్చరించారు.