మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్29
కొండపాక మండలంలో 108 అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తత, నైపుణ్యం వల్ల గర్భిణీకి సురక్షితంగా పురుడు పోసి పండంటి ఆడబిడ్డను ఈ లోకానికి ఆహ్వానించిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం సమయంలో చోటుచేసుకుంది.కొండపాక గ్రామానికి చెందిన లక్ష్మి అనే గర్భిణీకి అకస్మాత్తుగా తీవ్రమైన పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే (108)కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే 108 మెడికల్ టెక్నీషియన్ మహేందర్ అంబులెన్స్తో గ్రామానికి చేరుకున్నారు.ఈ సమయంలో లక్ష్మికి నొప్పులు తీవ్రతరంగా మారడంతో ఆసుపత్రికి తరలించే పరిస్థితి లేకపోయింది. ఈ విషయాన్ని 108 ఉన్నత అధికారులకు తెలియజేయగా, వారి సూచనల మేరకు గర్భిణీ ఇంట్లోనే సురక్షితంగా ప్రసవం జరిపించారు. ఫలితంగా లక్ష్మి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ప్రసవానంతరం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో, తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు 108 సిబ్బంది సేవలను అభినందిస్తూ, వారి సమయస్ఫూర్తి వల్లే ఈ సంతోషకర ఫలితం సాధ్యమైందని పేర్కొన్నారు.