manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 4:17 am Editor : Mana Praja Prathinidhi

వీరారెడ్డిపల్లిలో ప్రజాస్వామ్య పండుగనూతన సర్పంచ్‌,వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారంతో గ్రామపంచాయతీకి సరికొత్త జీవం.

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లి.దుబ్బాక నియోజకవర్గం.సిద్దిపేట జిల్లాడిసెంబర్23
అక్బర్‌పేట్ భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. గ్రామ సర్పంచ్‌గా చాట్లపల్లి బాల మల్లేశం గౌడ్ ఉప సర్పంచ్ రంగనమైన కనకరాజు బాధ్యతలు స్వీకరించగా, ఆయనతో పాటు వార్డు సభ్యులు1. మైసిగళ్ల ఎల్లవ్వ 2. కేశపాక స్వామి 3. చెప్యాల లక్ష్మి 4. మేకల   నరసింహులు 6. అగుల్ల వాణి 7. కొంపల్లి రమేష్ 8. రంగనమైన స్వామి9.షేక్ హసీనా19.మైసిగళ్ల దుర్గలింగం కూడా ప్రమాణ స్వీకారం చేశారు.ఎన్నాళ్లుగానో ఎన్నికైన పాలన లేక నిర్జీవంగా మారిన గ్రామపంచాయతీలకు నేడు సరికొత్త ఊపిరి వచ్చినట్టుగా గ్రామస్తులు భావిస్తున్నారు. సుమారు 23 నెలల పాటు (దాదాపు రెండు సంవత్సరాలు) ఎన్నికైన పాలనలేకపోవడంతో గ్రామపంచాయతీలు అధికారుల సేవలకే పరిమితమయ్యాయి. ఫలితంగా అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.నేడు నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించడంతో ఎండిన నేలపై వాన పడినట్టుగా, గ్రామాల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. గ్రామపంచాయతీ కార్యాలయం పండుగ వాతావరణాన్ని తలపించగా, ప్రజాస్వామ్యానికి మళ్లీ గౌరవం దక్కిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం.ఈ.ఓ. ఆంజనేయులు హాజరై మాట్లాడుతూ,
గ్రామపంచాయతీ ప్రజాస్వామ్యానికి పునాది. గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ప్రజలు అప్పగించిన ఈ పవిత్ర బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ, అవినీతికి తావులేకుండా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి” అని సూచించారు. యువత నాయకత్వంలో గ్రామాలకు స్వర్ణ భవిష్యత్తు సిద్ధమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.గ్రామపంచాయతీ నిధుల సక్రమ వినియోగం, పెండింగ్ బిల్లుల పరిష్కారం, అభివృద్ధి పనుల్లో పారదర్శకత పాటించాలని గ్రామస్తులు కోరారు. గెలుపు గర్వం లేకుండా, ఓటమి శత్రుత్వానికి తావులేకుండా అందరూ కలిసి గ్రామాభివృద్ధి కోసం పనిచేయాలని నూతన పాలకవర్గానికి హితవు పలికారు.తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామసభల నిర్వహణ, రోడ్లు–పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడం, ప్రభుత్వ పథకాల సమర్థ అమలు, గ్రామస్తుల సమస్యల పరిష్కారం వంటి బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని గుర్తు చేశారు.ప్రస్తుత పాలకవర్గంలో సుమారు 60 శాతం యువత ఉండటం గ్రామానికి మరింత ఆశాజనకంగా మారిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన పాలకవర్గం పట్టు పగ్గాలు స్వీకరించడంతో గ్రామాల్లో మళ్లీ ప్రజాస్వామ్య పాలనకు బంగారు బాటలు పడుతున్నాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.