మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.డిసెంబర్ 28
సిరిసిల్ల పట్టణంలో పట్టపగలే దొంగతనం చోటుచేసుకోవడం కలకలం రేపింది. బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకొని వెళ్తున్న ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని, బైక్ డిక్కీలో ఉంచిన రూ.99 వేల నగదును దుండగుడు తస్కరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తంగళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సంఘటన వివరాల ప్రకారం, ఈ నెల 11వ తేదీన జిల్లెల్ల గ్రామానికి చెందిన పబ్బతి ఎల్లారెడ్డి (తండ్రి: రాజిరెడ్డి) సిరిసిల్లలోని ఎస్బీఐ బ్యాంక్ నుంచి రూ.99 వేల నగదును డ్రా చేశారు. ఆ నగదును తన ద్విచక్ర వాహనం డిక్కీలో భద్రపరుచుకుని ఇంటికి బయలుదేరారు.మార్గమధ్యలో ఒక మెడికల్ షాప్ వద్ద బైక్ను ఆపి లోపలికి వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత తిరిగి వచ్చేసరికి బైక్ డిక్కీ తెరిచి ఉండటం, అందులో ఉంచిన నగదు మాయమవ్వడం గమనించి ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన తంగళ్ళపల్లి పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఈ క్రమంలో నల్ల రంగు చొక్కా ధరించిన ఓ వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితుడికి సంబంధించిన ఫోటోలు, వీడియో దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.పోలీసుల విజ్ఞప్తి ఫోటోల్లో కనిపిస్తున్న వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే లేదా అతని గురించి ఏమైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే తంగళ్ళపల్లి ఎస్ఐ గారికి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
📞 సంప్రదించాల్సిన నంబర్:
తంగళ్ళపల్లి ఎస్ఐ – 8712656370