manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 20 December 2025, 8:44 am Editor : Mana Praja Prathinidhi

విద్యుదాఘాతంతో యువ రైతు దుర్మరణం

మెదక్జిల్లా,మెదక్ మండలం.గుట్టకిందిపల్లి(మనప్రజాప్రతినిధి)డిసెంబర్20
మెదక్ జిల్లా మెదక్ మండలంలోని గుట్టకిందిపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ యువ రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.గ్రామీణ ఠాణా ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం…గ్రామానికి చెందిన ఐతర బోయిన చంద్రం (30) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, ఇద్దరు చిన్న పిల్లలతో సాదాసీదాగా జీవిస్తున్న చంద్రం కుటుంబానికి ఏకైక ఆధారస్తంభంగా ఉన్నాడు.
శుక్రవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో చంద్రం తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న బోరు మోటారు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో కారణం తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో మోటారు నియంత్రికను నిలిపివేసే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన స్థలంలోనే అతడు ప్రాణాలు విడిచాడు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.యువ వయసులోనే చంద్రం మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భార్య, ఇద్దరు చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉండగా, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకుని సంతాపం తెలిపారు.
ఈ విషాద ఘటనతో గుట్టకిందిపల్లి గ్రామంలో శోకసంద్రం నెలకొంది.