manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 30 December 2025, 2:15 pm Editor : Mana Praja Prathinidhi

నూతన సంవత్సర వేడుకల్లో అప్రమత్తంగా ఉండాలి : ఏర్పేడు సీఐ శ్రీకాంత్ రెడ్డి

మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్30
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏర్పేడు సీఐ బి. శ్రీకాంత్ రెడ్డి సూచించారు. ఈ సందర్భం గా ఏర్పేడు మండల ప్రజలకు పోలీస్ శాఖ తరఫున 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.డిసెంబర్ 31 సాయంత్రం నుంచి మండల పరిధిలో ప్రత్యేక పోలీసు బృందాలతో వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, ఓపెన్ డ్రింకింగ్ కేసుల నమోదు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా కింది సూచనలు పాటించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో తమ ఇళ్ల వద్దనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించరాదని సూచించారు. రోడ్లపై వేడుకలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదం జరిగితే తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపితే వాహనం సీజ్ చేయడంతో పాటు రూ.10,000 జరిమానా విధించబడుతుందని తెలిపారు.అతివేగంగా వాహనాలు నడపడం, అధిక శబ్దంతో వాహనాలు నడపడం నిషేధమని పేర్కొన్నారు. మోటార్ సైకిళ్లతో ర్యాలీలు నిర్వహించినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు.
మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలు జరిగితే ప్రాణాపాయం కలగడంతో పాటు రెండు కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని పేర్కొంటూ తల్లిదండ్రులు ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలని సూచించారు.నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, ప్రశాంతంగా జరుపుకుంటూ పోలీస్ శాఖకు సహకరించాలని సీఐ శ్రీకాంత్ రెడ్డి మండల ప్రజలను కోరారు. ఈ సందేశాన్ని సోషల్ మీడియా మరియు వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు.