•భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్
మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్30
తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుపతిలో భక్తుల రాకపోకలు భారీగా ఉండనున్న నేపథ్యంలో, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఈరోజు ఉదయం వివిధ కీలక ప్రాంతాల్లో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా చంద్రగిరి శ్రీవారి మెట్టు. అప్పలాయ గుంట,అలిపిరి పాదాల మార్గాలు తదితర ప్రాంతాలను సందర్శించిన జిల్లా ఎస్పీ, భక్తుల సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు విధులు, రద్దీ నిర్వహణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో పోలీస్ సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రద్దీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ మరియు సంబంధిత శాఖల సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.అన్ని కీలక ప్రాంతాలను కామన్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కు సీసీ కెమెరాల ద్వారా అనుసంధానం చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణతో పాటు, ఏ చిన్న సమాచారం ఉన్నా వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్కు తెలియజేస్తూ సమన్వయం తో విధులు నిర్వర్తించాలని సూచించారు.టీటీడీ–పోలీస్ శాఖల సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్న జిల్లా ఎస్పీ, వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ అన్ని విభాగాలతో కలిసి పూర్తి స్థాయిలో పనిచేస్తోందని స్పష్టం చేశారు.