మనప్రజాప్రతినిధి//అక్బర్ పేట.భూంపల్లిమండలం,
సిద్దిపేట జిల్లా డిసెంబర్ 2
విరారెడ్డిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ బాలకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, విరారెడ్డిపల్లి నుండి జంగపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతిని గ్రామ ప్రజలు ప్రతిరోజూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చెరువు కట్ట మీదుగా వెళ్లే ఈ మార్గం వర్షాకాలంలో పూర్తిగా చెదిరిపోయి ప్రమాదకరంగా మారిందన్నారు.రహదారి దురస్థితి కారణంగా విద్యార్థులు, రైతులు, వృద్ధులు, ఉద్యోగాలు చూసుకునే వారు, గ్రామంలోని మహిళలు, పిల్లలుఅందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అత్యవసర వైద్యసేవలు అందించాల్సిన వాహనాలు కూడా ఈ మార్గంలో సాఫీగా నడవలేని స్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. వర్షాలు పడిన రోజుల్లో ఈ మార్గం పూర్తిగా పనికిరాక గ్రామం వెలుపలికి వెళ్లే ప్రజలు, రోజూ ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నారని తెలిపారు.ఈ సమస్యను గ్రామ ప్రజల తరఫున వెంటనే పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి, సంబంధిత ఇంజనీరు చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ బాలకృష్ణ విన్నవించారు.