మనప్రజాప్రతినిధి//మెదక్.డిసెంబర్26
పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన మహనీయుడు కామ్రేడ్ కేవల్ కిషన్ అని, ఆయన ఆశయాల సాధనకై ఉద్యమాన్ని కొనసాగించాలని ముదిరాజ్ మహాసభ నాయకులు పిలుపునిచ్చారు.
కామ్రేడ్ కేవల్ కిషన్ 65వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మెదక్ పట్టణంలోని పోలంపల్లి వద్ద ఉన్న కేవల్ కిషన్ విగ్రహానికి ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి అక్షయ్ కుమార్, మెదక్ జిల్లా అధ్యక్షులు మానేగల రామకృష్ణయ్య తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ-కామ్రేడ్ కేవల్ కిషన్ ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి, పేదలు, శ్రామికులు, కార్మికుల హక్కుల కోసం పోరాట మార్గాన్ని ఎంచుకున్న గొప్ప విప్లవకారుడని తెలిపారు. కుల వివక్షత, అంటరాప్పనితనం, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో చైతన్యానికి బాటలు వేసాయని గుర్తు చేశారు.పేదల పోరాటాలతో పెత్తందారులు వణికిపోయి, 1960 డిసెంబర్ 26న పోలంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం ముసుగులో ఆయనను హత్య చేశారని, అయితే ఆయనను భౌతికంగా మాత్రమే చంపగలిగారే తప్ప ఆయన ఆశయాలను మాత్రం ప్రజల నుంచి వేరు చేయలేకపోయారని అన్నారు.కేవల్ కిషన్ హత్య జరిగిన ప్రాంతంలోనే సమాధి నిర్మించి, ప్రతి సంవత్సరం ఎడ్లబండ్ల జాతరను ఘనంగా నిర్వహించడం ఆయనపై ప్రజలకున్న అభిమానానికి నిదర్శనమన్నారు. ఈ సమాధి వద్ద స్మృతివనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.కేవల్ కిషన్ చేసిన పోరాటాల స్ఫూర్తితోనే ప్రజలు తమ పిల్లలకు కేవల్ కిషన్, కేవల్ కిషణమ్మ వంటి పేర్లు పెట్టుకున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలో అనేక ప్రజాఉద్యమాలకు కేవల్ కిషన్ భవన్ వేదికగా నిలవడం ఆయన పోరాటాల స్మృతులకు జీవంత సాక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ నాయకులు బిసా శ్రీనివాస్, కుర్తివాడ శేఖర్, పేట స్వామి, మానేగల భాస్కర్ ముదిరాజ్, బోయిన అరుణ, పడిగే స్వరూప తదితరులు పాల్గొన్నారు.