•పేదల హృదయాల్లో చిరస్థాయి నేత – కేవల్ కిషన్
•కేవల్ కిషన్ స్మృతి… పోరాటానికి పిలుపు
•పోరాటం ఆగదు – కేవల్ కిషన్ ఆశయాలు సజీవం
•పొలంపల్లి వద్ద స్మృతి వనం ఏర్పాటు చేయాలి
•ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి బండ నరేందర్
మనప్రజాప్రతినిధి//మెదక్ జిల్లా.డిసెంబర్ 26
పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు కామ్రేడ్ కేవల్ కిషన్ అని, ఆయన ఆశయాల కోసం ప్రజలంతా ఉద్యమించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి బండ నరేందర్ పిలుపునిచ్చారు.కామ్రేడ్ కేవల్ కిషన్ 65వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం మెదక్ పట్టణంలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేవల్ కిషన్ విగ్రహానికి ముదిరాజ్ మహాసభ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బండ నరేందర్ మాట్లాడుతూ… కేవల్ కిషన్ ఉన్నత విద్యలు అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం త్యజించి, పేద ప్రజల హక్కుల కోసం పోరాట మార్గాన్ని ఎంచుకున్న విప్లవాత్మక నేత అని గుర్తు చేశారు. శ్రామికులు, కార్మికులను ఐక్యపరిచి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలకు నాయకత్వం వహించారని తెలిపారు.ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం, తిరుగుబాటు భావనను చూసి భూస్వాములు, పెత్తందారులు వణికిపోయారని, ఆ ధైర్యానికి ప్రతీక అయిన కేవల్ కిషన్ను ఎలాగైనా అంతమొందించాలనే కుట్రలో భాగంగా 1960 డిసెంబర్ 26న పొలంపల్లి సమీపంలో రోడ్ యాక్సిడెంట్ పేరుతో హత్య చేశారని అన్నారు. అయితే ఆయనను భౌతికంగా మాత్రమే చంపగలిగారని, ఆయన ఆశయాలను మాత్రం ప్రజల నుంచి వేరు చేయలేకపోయారని స్పష్టం చేశారు.కేవల్ కిషన్ హత్య జరిగిన పొలంపల్లి వద్దే సమాధిని నిర్మించి, ప్రతియేటా ఎడ్లబండ్లతో జాతర నిర్వహించడం ఆయనపై ప్రజల అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. అక్కడే స్మృతి వనం ఏర్పాటు చేసి, ఆయన పోరాటాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో పెట్టిచాకిరి, కుల వివక్షత, అంటరానితనం, మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా కేవల్ కిషన్ చేసిన పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూస్వామ్యానికి ఎదురుగా నిలబడి, అణచివేతకు గురైన ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చి ఉద్యమాలు నిర్వహించారని గుర్తు చేశారు.కేవల్ కిషన్ చేసిన పోరాటాల జ్ఞాపకంగా మెదక్ పరిసర ప్రాంతాల్లో పుట్టిన పిల్లలకు కేవల్ కిషన్, కేవల్ కిషణమ్మ వంటి పేర్లు పెట్టుకోవడం ఆయన ప్రజాదరణకు నిదర్శనమని అన్నారు. జిల్లా కేంద్రంలో అనేక ప్రజా పోరాటాలకు కేంద్రబిందువుగా నిలిచిన కేవల్ కిషన్ భవన్ ఆయన ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అది సూరి, బండి గోపాల కృష్ణ, గోవింద్ రాజ్, గోదల కృష్ణ, బీమరి కిశోర్, శేఖర్, సందీప్, ప్రభాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.