manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 30 December 2025, 1:55 am Editor : Mana Praja Prathinidhi

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన రెడ్డివారి గురువారెడ్డి

గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియామకానికి సీఎం ఆశీస్సులు
మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్30
ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని వారి చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తన నియామకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, శ్రీకాళహస్తీశ్వర స్వామి – జ్ఞాన ప్రసూనాంబ శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలను ముఖ్యమంత్రివర్యులకు సమర్పించి వారి ఆశీర్వాదం పొందారు. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,“నీవు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన నిబద్ధత గల నాయకుడివి. అందుకే జిల్లా స్థాయిలో కీలకమైన గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాధ్యతలను నీకు అప్పగించాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేసి ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకురావాలి” అని స్పష్టంగా ఆదేశించారు.అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీనియర్ నాయకుడిగా, నిరంతరం పార్టీ కోసం పనిచేస్తూ, బీసీ వర్గాలకు చెందిన నాయకుడిగా నీకు ఈ అవకాశం కల్పించడం పార్టీ బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం అని చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇంకా మెరుగైన అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై రెడ్డివారి గురువారెడ్డి ముఖ్యమంత్రికి సమగ్రంగా వివరించారు.పార్టీపై అచంచల నిబద్ధతతో ముందుకు సాగుతున్న రెడ్డివారి గురువారెడ్డి, ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.