మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి,డిసెంబర్25:
శ్రీకాళహస్తి పట్టణంలోని కాసగార్డెన్ చర్చ్ వద్ద నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులతో కలిసి క్రిస్మస్ సంబరాల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
క్రిస్మస్ శాంతి, ప్రేమ, త్యాగం, సోదరభావాన్ని ప్రపంచానికి చాటే పవిత్ర పండుగ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. యేసుక్రీస్తు జననం ద్వారా మానవాళికి ప్రేమ, క్షమ, సేవా భావాన్ని బోధించారని అన్నారు. పేదల పట్ల కరుణ, అవసరమైనవారికి సహాయం చేయాలనే సందేశాన్ని క్రిస్మస్ అందిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నారులతో ఆత్మీయంగా మమేకమై, ప్రేమగా పిల్లలతో సెల్ఫీలు దిగారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.అనంతరం ప్రభువు దీవెనలు అందరిపై ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి నెలకొనాలని ఆకాంక్షిస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు, క్రైస్తవ సంఘ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.