మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.డిసెంబర్ 07
రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తిగా స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం విస్తృత చర్యలు చేపట్టింది. ప్రతి ఓటరు ఎలాంటి భయం లేకుండా తన ఓటు హక్కును వినియోగించుకునేలా గ్రామాల్లోకి వెళ్లి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.ఎన్నికల నియమావళిపై ప్రజల్లో చైతన్యం పెంచుతూ, పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు, మద్యం లేదా విలువైన వస్తువులు పంపిణీ చేయడం నేరమని, అలాంటి సమాచారం అందిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని ఆయన సూచించారు.జిల్లాలో మూడు విడతలుగా జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, ఇందుకోసం సుమారు 800 మంది పోలీస్ సిబ్బందిను ప్రత్యేకంగా మోహరించినట్లు తెలిపారు.శాంతి భద్రతలను భంగపెట్టే చర్యలకు పాల్పడినా, రెచ్చగొట్టే మాటలతో ప్రజలను అల్లర్లకు ప్రేరేపించినా, ఎన్నికల నియమావళి ప్రకారం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు.