manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 20 December 2025, 8:50 am Editor : Mana Praja Prathinidhi

యాప్‌ల పేరుతో రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం

యూరియా ఇవ్వలేక ఆన్‌లైన్ డ్రామాలు-బుర్రసూర్యగౌడ్ ఫైర్
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్20
ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేయలేని ప్రభుత్వం యాప్‌లు, ఆన్‌లైన్ పేరుతో రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆయన ఆరోపించారు.నాట్లు వేసుకునే కీలక సమయంలో రైతులు పొలాల్లో ఉండాలా? లేక వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతూ యాప్‌లు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అంటూ కాలయాపన చేయాలా? అని ఆయన ప్రశ్నించారు. యూరియా సరిపడా అందించడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం, తన వైఫల్యాలను దాచేందుకు కొత్త కొత్త విధానాలను తెరపైకి తెస్తోందన్నారు.రైతుల సమస్యలను పరిష్కరించకుండా కాగితాల మీద, యాప్‌ల మీద పాలన సాగిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. తక్షణమే ఇలాంటి ప్రజావ్యతిరేక కార్యక్రమాలను విరమించుకొని, రైతులకు అవసరమైన మేరకు యూరియాను సకాలంలో సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని బుర్ర సూర్య గౌడ్ గట్టిగా హెచ్చరించారు.