•జర్నలిస్టుల హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదు : లాయక్ పాషా
•డిసెంబర్ 27న చలో కలెక్టరేట్కు టీయూడబ్ల్యూజే పిలుపు
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్ 26
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.252ను వెంటనే సవరించాల్సిందేనని, ఆ వరకు జర్నలిస్టుల పోరాటం ఆగదని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–హెచ్ 143) రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా స్పష్టం చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈనెల 27న నిర్వహించనున్న ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని జర్నలిస్టులంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వేములవాడ పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ, నూతన జీవో–252 వర్కింగ్ జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ఉందని విమర్శించారు. ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులు, కేబుల్ జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమాన్ని విస్మరించే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తే సహించేది లేదన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం జర్నలిస్టులను నిర్లక్ష్యం చేసిందని, మెజారిటీ జర్నలిస్టుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.జీవో–252ను తక్షణమే సవరించని పక్షంలో, రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు రేగుల రాంప్రసాద్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మొహమ్మద్ రఫీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపాక నరసయ్య, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, అబ్దుల్ జబ్బర్, సభ్యులు దేబ్బేటి ప్రవీణ్, చేకూర్త్తి నవీన్ తదితరులు పాల్గొన్నారు.