హెల్మెట్అవగాహనకు700బైకులతోఘనర్యాలీజెండా ఊపిప్రారంభించినజిల్లాకలెక్టర్-జిల్లాఎస్పీ
మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్15
“హెల్మెట్ ధరించండి-జీవితం కాపాడుకోండి”
మీ ప్రాణం.మీ కుటుంబానికి అమూల్యమైనది
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం తగ్గించడమే లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై భారీ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధనను కఠినంగా అమలు చేస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా 700 ద్విచక్ర వాహనాలతో ఘన బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ శ్రీ డా. ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్., మరియు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., జెండా ఊపి ప్రారంభించారు. ప్రత్యేక ఆకర్షణగా జిల్లా ఎస్పీ స్వయంగా బైక్ నడపగా, జిల్లా కలెక్టర్ హెల్మెట్ ధరించి వెనుక కూర్చుని ర్యాలీలో పాల్గొని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.“చట్ట భయంతో కాదు… కుటుంబ భవిష్యత్తు కోసం హెల్మెట్”-కలెక్టర్
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, యువతలో వేగం, నిర్లక్ష్యం కారణంగా ద్విచక్ర వాహన ప్రమాదాల్లో ప్రాణ నష్టం అధికమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.హెల్మెట్ ధరించడం వల్ల తీవ్రమైన ప్రమాదాల్లోనూ ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు.
“మీ ఒక్క నిర్లక్ష్య నిర్ణయం మీ తల్లిదండ్రుల కన్నీళ్లకు కారణం కావచ్చు.మీ ఒక్క మంచి నిర్ణయం వారి జీవితానికి భరోసా అవుతుంది” అంటూ యువతను భావోద్వేగంగా హెచ్చరించారు. ప్రతి యువకుడు తన స్నేహితులకు హెల్మెట్ ప్రాధాన్యతను తెలియజేయాలని పిలుపునిచ్చారు.
“హెల్మెట్ పోలీసుల కోసం కాదు…మీ ప్రాణాలకోసం”ఎస్పీ
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో 18 నుంచి 35 ఏళ్ల యువతే అత్యధికంగా ఉంటున్నారని తెలిపారు. వీరిలో చాలామంది హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని స్పష్టం చేశారు.
హెల్మెట్ భారంలా అనిపించినా అదే జీవితానికి రక్షణ కవచమని పేర్కొన్నారు.డ్రైవర్తో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగా ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్ ధరించాలి అని స్పష్టం చేశారు.పోలీసుల లక్ష్యం జరిమానాలు విధించడం కాదని, రోడ్డు ప్రమాదాలను నివారించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సోషల్ మీడియా రీల్స్ కోసం నిర్లక్ష్యంగా బైక్ నడపొద్దని హెచ్చరిస్తూ, హెల్మెట్ లేకుండా బైక్ ఎక్కే స్నేహితుడిని ఆపడం – అదే నిజమైన స్నేహం అని అన్నారు.ర్యాలీ వివరాలుఈ అవగాహన బైక్ ర్యాలీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై అన్నమయ్య సర్కిల్-ఎం.ఆర్.పల్లి సర్కిల్ – బాలాజీ కాలనీ మీదుగా సాగి, ప్రకాశం రోడ్డులోని జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ముగిసింది. ర్యాలీ మార్గమంతా ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో స్పందిస్తూ హెల్మెట్ సందేశాలను స్వీకరించారు.
పాల్గొన్న అధికారులు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహర్ ఆచారి (శాంతి భద్రతలు), నాగభూషణం (క్రైమ్), శ్రీనివాసులు (ఏఆర్), డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు ఇతర విభాగాల సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.