మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్31
వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని కాట్రపల్లి గ్రామం భక్తి వాతావరణంతో పరవశించింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ తమ స్వగ్రామంలో వెలసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠనాథ స్వామీ వారికి అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ మహోత్సవాన్ని కోలా ఆనంద్తో పాటు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు కోలా విశాలి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే స్వామివారికి అభిషేకాలు, అలంకరణలు నిర్వహించగా, అనంతరం కోలాటాల నడుమ పురవీధుల్లో ఊరేగింపులు నిర్వహించారు.వైకుంఠ ద్వారం దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తులకు విశాలంగా ప్రసాద వితరణ చేయడంతో పాటు ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేయడం విశేషంగా నిలిచింది.గ్రామమంతా భక్తి నినాదాలు, శ్లోకాలతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నంద కుమార్, గవర్ల కృష్ణయ్య, కోలా గోవర్ధన్, గ్రామస్తులు, బీజేపీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలకు మరింత శోభను చేకూర్చారు.భక్తి, సంప్రదాయం, సేవా భావం మేళవించిన ఈ వైకుంఠ ఏకాదశి మహోత్సవం కాట్రపల్లి గ్రామానికి ప్రత్యేక గుర్తింపునిచ్చిందని స్థానికులు ప్రశంసించారు.