ప్రజాప్రతినిధిన్యూస్//సిరిసిల్ల:
సిరిసిల్ల పట్టణంలోని రేషన్ షాపు నంబర్ 3908026లో భారీ ఎత్తున బియ్యం, చక్కెర నిల్వల వ్యత్యాసం వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం 11 గంటలకు సిరిసిల్ల డెప్యూటీ తాసిల్దార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించగా, డీలర్ ఆకునూరి అశోక్ నిర్వర్తిస్తున్న ఈ షాపులో రికార్డులకు, వాస్తవ నిల్వలకు మధ్య భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు.అధికారుల తనిఖీలో భాగంగా రికార్డుల ప్రకారం 92.51 క్వింటాళ్ల సన్న బియ్యం, 62.55 క్వింటాళ్ల పీడీఎస్ (దొడ్డు) బియ్యం, 87 కిలోల చక్కెర నిల్వలు ఉండాలి. అయితే, షాపులో కేవలం 31.50 క్వింటాళ్ల సన్న బియ్యం, 35 కిలోల చక్కెర మాత్రమే ఉన్నట్లు నిర్ధారించారు.ఈ భారీ నిల్వల వ్యత్యాసంపై పౌర సరఫరాల శాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను డీలర్ ఆకునూరి అశోక్పై నిత్యావసర సరుకుల చట్టం 1955, సెక్షన్ 6A కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తక్షణ చర్యగా, ఆ షాపులోని ప్రస్తుత స్టాకును పక్కనే ఉన్న డీలర్ ఎస్. విజయ (షాప్ నంబర్ 3908014)కు అప్పగించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ ఘటనతో సిరిసిల్ల పట్టణంలో రేషన్ పంపిణీ వ్యవస్థ పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.