manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 6:25 am Editor : Mana Praja Prathinidhi

దుర్గంధమైన వాసనలో ప్రయాణం…ఏర్పేడు–వెంకటగిరి రహదారిపై ప్రయాణికుల అవస్థలు

చికెన్ వ్యర్థాలతో రోడ్లపై కుక్కల బెడద…పట్టించుకోని అధికారులు… ప్రమాదాల ముప్పులో వాహనదారులు
మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.జనవరి21
తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని ఏర్పేడు మండలం నుంచి వెంకటగిరికి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంగా రహదారి ఇరువైపులా చికెన్ వ్యర్థాలను విచ్చలవిడిగా పారవేయడంతో ఆ ప్రాంతమంతా భరించలేని దుర్గంధంతో నిండిపోయింది.పారవేసిన చికెన్ వ్యర్థాలను తినేందుకు కుక్కలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి రావడంతో వాహనదారులకు తీవ్ర ప్రమాదాలు ఎదురవుతున్నాయి. పగలు–రాత్రి అనే తేడా లేకుండా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం ఈ సమస్యపై పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే దుర్గంధం భరించలేకపోవడం ఒకవైపు, కుక్కల బెడదతో ప్రమాదాలు జరుగుతుండటంతో కుటుంబాలు రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అక్రమంగా వ్యర్థాలు పారవేసే వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఏర్పేడు మండలంలో కనీసం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ లేదా ఫుడ్ కమిషనర్ ఎవరో కూడా తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండలంలోని హోటళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, కుళ్లిపోయిన పదార్థాలు ప్రజలకు అందకుండా చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన ఆహారం అందేలా పర్యవేక్షణ పెంచాలని ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను ప్రజలు కోరుతున్నారు.ప్రస్తుతం ఏర్పేడు పరిధిలోని హోటళ్లలో భోజనం చేయాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సమస్యలపై అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందేనని ప్రజలు అంటున్నారు.