manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 3:13 pm Editor : Mana Praja Prathinidhi

బిడ్డలు పుడతారని నమ్మించి దంపతుల నుంచి రూ.20 వేలు కొట్టేసిన ఘరానా మోసగాడు… శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కలకలం

తిరుపతిజిల్లా//కేవీబీపురం,జనవరి22(మనప్రజాప్రతినిధి):
బిడ్డలు పుడతాయని మాయమాటలు చెప్పి నిరుపేద దంపతులను నమ్మించి రూ.20 వేల నగదు దోచుకుని ఉడాయించిన ఘరానా మోసగాడు కేవీబీ పురం మండలంలో కలకలం రేపాడు.మండలం లోని కలతూరు దళితవాడకు చెందిన పన్నీరు (30), సంధ్య (25) దంపతులకు సంతానం లేకపోవడంతో వారి బలహీనతను ఆసరాగా చేసుకున్న ఓ మోసగాడు, తాను డాక్టర్‌నని చెప్పుకొని 2026 జనవరి 22న ఉదయం 9 గంటల సమయంలో సూట్–బూట్ ధరించి మోటార్ సైకిల్‌పై వారి ఇంటికి వచ్చాడు. “దేవుడి దయతో బిడ్డలు పుడతాయి… నేను ఇచ్చే మాత్రలు మింగితే చాలు” అంటూ వారిని నమ్మబలికాడు.డబ్బులు లేవని చెప్పడంతో, ఉన్న నగలను తాకట్టుపెట్టి ఇవ్వాలని సూచించిన ఆ మోసగాడు, దంపతులను తన బైక్‌పై ఎక్కించుకొని కేవీబీ పురంకు తీసుకెళ్లి, నగలు కుదువ పెట్టించి రూ.20,000 నగదు తీసుకున్నాడు. అనంతరం “శ్రీకాళహస్తికి వెళ్తే మందులు తీసుకువస్తాను” అంటూ మరోసారి మోసం చేసి, రాజీవ్‌నగర్ సమీపంలోని నిర్మాణస్థలంలో దంపతులను కూర్చోబెట్టి, మాత్రలు తెచ్చేందుకు వెళ్లి తిరిగి రాలేదు.అరగంటపాటు స్పృహ లేని పరిస్థితిలో ఉన్నామని, ఆ తర్వాత మోసపోయినట్లు గ్రహించామని బాధిత దంపతులు వాపోతున్నారు. నగలు తాకట్టు పెట్టిన సమయంలో మోసగాడు బైక్‌పై నిలబడి ఉన్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యి ఉండే అవకాశం ఉందని, వాటిని పరిశీలిస్తే నిందితుడిని పట్టుకోవచ్చని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రీకాళహస్తి చెక్‌పోస్టు, దేవస్థానం పరిసరాల్లోని సీసీ కెమెరాలు పరిశీలిస్తే మోసగాడి ఆచూకీ లభించే అవకాశం ఉందని, ఇలాంటి మోసాలు మరెవరికీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బిడ్డలు పుడతాయని, మంత్రాలు–మందులు అంటూ ప్రజలను మోసం చేస్తున్న మాంత్రికులు ఎక్కువవుతున్నారని, ఇలాంటి వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీస్ శాఖ కూడా ప్రజలకు సూచిస్తోంది.