•గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆస్పత్రి సేవలను ప్రశంసించిన ఎంపీ
•గుండె శస్త్రచికిత్సలు పూర్తిచేసుకున్న చిన్నారులకు ‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్’ సర్టిఫికెట్లు
•నిస్వార్థ సేవే సమాజానికి మార్గదర్శకం-ఎంపీ రఘునందన్ రావు
•సత్యసాయి సజీవని సేవలు దేశానికే ఆదర్శం
•ఆస్పత్రి సేవలను పరిశీలించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు
కొండపాకమండలం:మనప్రజాప్రతినిధి//జనవరి27
చిన్నారుల ప్రాణాలను కాపాడే పవిత్ర సేవలో సత్యసాయి సజీవని ఆస్పత్రి ఆదర్శంగా నిలుస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొండపాక శివారులోని సత్యసాయి సజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి, గుండె శస్త్రచికిత్సలు పూర్తి చేసుకున్న చిన్నారులకు ఆస్పత్రి చైర్మన్ శ్రీనివాస్ ‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్’ సర్టిఫికెట్లు అందజేశారు.ఆస్పత్రిలో చిన్నారులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఎంపీ, సమాజానికి అత్యవసరమైన సేవలను నిస్వార్థంగా అందిస్తున్న సత్యసాయి సజీవని ట్రస్ట్ పాత్ర ప్రశంసనీయమన్నారు. వైద్యులు, సిబ్బంది సేవా భావంతో పనిచేస్తుండటం అభినందనీయమని తెలిపారు.ప్రతి ఒక్కరిలో సేవా మనస్తత్వం పెంపొందినప్పుడే సమాజం ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సృజన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మండల అధ్యక్షుడు నీల సత్యం, పార్టీ నాయకులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.