manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 3:24 pm Editor : Mana Praja Prathinidhi

ఢిల్లీ యువ పార్లమెంట్‌లో రుద్రారం యువతి మెరుపు…జాతీయ అవార్డు సాధించిన “తుమ్మ నక్షత్ర…..

రుద్రారం యువతి తుమ్మ నక్షత్ర జాతీయ యువ పార్లమెంట్‌లో ప్రతిభతో మెరుపులు, ఢిల్లీలో అవార్డు అందుకుంది.

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లిమండలం.జనవరి17
సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లి మండలం రుద్రారం గ్రామం నుంచి వెళ్లిన ఓ విద్యార్థిని, దేశ రాజధాని ఢిల్లీలో తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందింది. వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయం మాజీ విద్యార్థిని తుమ్మ నక్షత్ర యువ పార్లమెంట్ వేదికపై జాతీయ స్థాయిలో మెరుపులు మెరిపించి అవార్డును సొంతం చేసుకున్నారు.
2024–2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన 26వ జాతీయ యువ పార్లమెంటరీ పోటీలు విజేతలకు డిసెంబర్ 26న ఢిల్లీలో నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవంలో, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు.వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన యువ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న తుమ్మ నక్షత్ర, పోటీలో ప్రతిపక్ష నాయకురాలిగావ్యవహరిస్తూ పార్లమెంటరీ సంప్రదాయాలు, సమకాలీన జాతీయ అంశాలపై గాఢమైన అవగాహనతో వక్తృత్వ ప్రతిభను ప్రదర్శించారు. ఆమె ప్రదర్శన న్యాయనిర్ణేతల ప్రశంసలను అందుకుంది.వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న సమయం లోనే ఈ విజయాన్ని సాధించిన తుమ్మ నక్షత్ర, ప్రస్తుతం శ్రీ చైతన్య ఆమిన్‌పూర్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. గ్రామ స్థాయి నుంచి జాతీయ వేదిక వరకు ఆమె చేసిన ఈ ప్రయాణం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.