గుంటూరు,జనవరి7(మనప్రజాప్రతినిధి)
నల్లపాడు రోడ్లో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి డ్వాక్రా బజార్ (సరస్)ను ఈ నెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి సందర్శించనున్న నేపథ్యంలో, పర్యటన మార్గంలో జీఎంసీ పరిధిలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు ఇప్పటికే పూర్తయ్యాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ముగిసే వరకు విధులు కేటాయించబడిన అధికారులు, సచివాలయ కార్యదర్శులు పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
బుధవారం నగర కమిషనర్ కలెక్టర్ బంగ్లా రోడ్, జీటీ రోడ్,చుట్టగుంట నుంచి నల్లపాడు రోడ్ వరకు పర్యటించి, పారిశుధ్య అభివృద్ధి పనుల ను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సరస్ వేదిక పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాల ని, సరస్లో ఉత్పన్నమయ్యే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎంహెచ్ఓను ఆదేశించారు. అలాగే ముఖ్యమంత్రి పర్యటించే మార్గాల్లో పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటడం, రోడ్లపై ప్యాచ్ వర్క్లు చేపట్టడం, రోడ్డుపక్క ఆక్రమణల తొలగింపుపై ప్రజారోగ్య, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.
పారిశుధ్య పనులు, ఆక్రమణల తొలగింపుకు ఆయా శాఖల అధికారు లు పూర్తి బాధ్యత వహించాలని, దీనికి సంబంధించిన విధుల కేటాయింపు ఉత్తర్వులు ఇప్పటికే జారీ చేసినట్లు కమిషనర్ తెలిపారు. జీటీ రోడ్ పక్కనే ఉన్న పీకలవాగులో సిల్ట్ తొలగింపు పనులు, కలెక్టర్ బంగ్లా రోడ్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్ బి. శ్రీనివాసరావు, ఈఈ సుందర్రామిరెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్సెస్లు, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.