manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 23 January 2026, 1:34 am Editor : Mana Praja Prathinidhi

హెడ్‌మాస్టర్ ముని లక్ష్మీ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన.

సైబర్ మోసాలు, మహిళల భద్రతపై విద్యార్థులకు కీలకఅవగాహన..ముఖ్య అతిథిగా ఏర్పేడు ఎస్సై రవి ప్రకాష్.

మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.జనవరి23
ఏర్పేడు మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏర్పేడు ఎస్సై రవి ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. వ్యక్తిగత సమాచార భద్రత ఎంత ముఖ్యమో వివరించారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న నేరాలు, గృహహింస, లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు వంటి అంశాలపై విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించి పూర్తి అవగాహన కల్పించారు.మహిళల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలపై తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించేందుకు 112 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు జరిగినప్పుడు 1930 హెల్ప్‌లైన్‌ను, బాలల రక్షణ కోసం 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ముని లక్ష్మీ, ఏర్పేడు ఎస్సై రవి ప్రకాష్, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.