ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం
డీఎస్సీ ఎస్జీటీ ఉద్యోగం పేరుతో భారీ మోసం
సీఎం పేషీలో పరిచయాలున్నాయంటూ నమ్మబలికిన నిందితులు
అనకాపల్లి, జనవరి 24 (మనప్రజాప్రతినిధి):
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ముఠాలు రోజు రోజుకు పేట్రేగిపోతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేషీ పేరునే వాడుకుంటూ లక్షలు దండుకున్న ఘటన అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది. డీఎస్సీలో ఎస్జీటీ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ మహిళ నుంచి రూ.12 లక్షలకు పైగా వసూలు చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, రోలుగుంట మండలానికి చెందిన ఓ మహిళకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని నిందితులు మభ్యపెట్టారు. ప్రధాన నిందితుడు ప్రకాశం జిల్లా నాయుడుపాలెం గ్రామానికి చెందిన ఎర్రగొర్ల శ్రీను కాగా, విజయవాడకు చెందిన షేక్ సలీం అతనికి సహకరించాడు. సీఎం పేషీలో ఉన్నతాధికారులతో తనకు సన్నిహిత పరిచయాలు ఉన్నాయని చెప్పి, కచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీను బాధితురాలిని నమ్మించాడు.
రూ.12 లక్షలకు పైగా నగదు వసూలు
ఈ మాటలు నమ్మిన బాధితురాలినుంచి నిందితులు విడతలవారీగా రూ.12 లక్షలకు పైగా నగదు వసూలు చేసి మోసగించారు. ఉద్యోగం రాకపోవడంతో అనుమానం వచ్చిన మహిళ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
పాత నేరస్తుడే ప్రధాన నిందితుడు: ఎస్పీ హెచ్చరిక
ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ, ప్రధాన నిందితుడు ఎర్రగొర్ల శ్రీను పాత నేరస్తుడని వెల్లడించారు. గతంలో కూడా ఎస్సై, లైన్మన్ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన చరిత్ర ఉందన్నారు. ఈ కేసులో ఇంకా బాధితులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఎస్పీ సూచించారు.