manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 2:53 pm Editor : Mana Praja Prathinidhi

పరీక్షల వేళ విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట.పరీక్షల వేళ విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 20న తల్లిదండ్రుల సమావేశ కార్యక్రమం
సిద్దిపేట(మనప్రజాప్రతినిధి):జనవరి5
పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ఉండేందుకు సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్)లో సోమవారం ప్రత్యేక ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాలలోని ప్రధమ, ద్వితీయ సంవత్సరం అన్ని గ్రూపుల విద్యార్థులను మైదానంలో క్రమబద్ధంగా కూర్చోబెట్టి సుమారు అరగంట పాటు ధ్యానం చేయించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ కమిషనరేట్ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో భాగంగా వారంలో రెండు రోజుల పాటు మెడిటేషన్ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యా ఒత్తిడి, పరీక్షల భయం వంటి అంశాలు విద్యార్థులపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ధ్యానం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.విద్యార్థులు రోజూ ఇంటి వద్ద కూడా ధ్యానం అలవాటు చేసుకోవాలని, దీనివల్ల ఏకాగ్రత పెరిగి చదువులో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు. అలాగే ఈ నెల 20వ తేదీన కళాశాలలో మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి హాజరై, పిల్లల చదువు, ప్రగతి, క్రమశిక్షణపై చర్చించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏజీఎంసీ దేవయ్య, స్టాఫ్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, స్టూడెంట్ కౌన్సిలర్ కనక చంద్రం, ఫాతిమా, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నంట శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి దరిపల్లి నగేష్, స్పోర్ట్స్ ఇంచార్జి అశోక్తో పాటు అధ్యాపకులు రాజశేఖర్ రెడ్డి, అఖిల్, వెంకటరమణ, రాజ్యలక్ష్మి, రవి, శ్రీకాంత్, నరేందర్ రెడ్డి, కొమరయ్య, గంగాధర్, ప్రసాద్, సత్యనారాయణ, బెతి శ్రీనివాస్, చక్రవర్తి, రాజశేఖర్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థినీ–విద్యార్థులు హాజరయ్యారు.