manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 1:48 pm Editor : Mana Praja Prathinidhi

మెదక్ జిల్లా మత్స్య శాఖ అధ్యక్షుడిగా గడప దేవేందర్ నియామకం.

మెదక్,జనవరి28(మనప్రజాప్రతినిధి)
మెదక్ జిల్లా మత్స్య శాఖ అధ్యక్షుడిగా తూప్రాన్ పట్టణానికి చెందిన గడప దేవేందర్‌ను ప్రభుత్వం నియమించింది. తెలంగాణ సహకార సంఘాల చట్టం–1964లోని సెక్షన్ 32(7)(a)(i) ప్రకారం జిల్లా మత్స్యకార సహకార సంఘం వ్యవహారాలను నిర్వహించే పర్సన్-ఇన్-ఛార్జ్‌గా ఆయనను నియమిస్తూ మత్స్య శాఖ డైరెక్టర్ & ఎక్స్-ఆఫీషియో రిజిస్ట్రార్ కె. నిఖిల ఐఏఎస్ జనవరి 24, 2026న ఉత్తర్వులు జారీ చేశారు.రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో ఈ నియామకం జరిగినట్లు సమాచారం. జిల్లా స్థాయిలో మత్స్యకార సహకార సంఘాలను బలోపేతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను మత్స్యకారులకు చేరవేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఈ నియామకం మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మత్స్యకార వర్గంలో రాజకీయంగా మరింత బలాన్ని చేకూరుస్తుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మత్స్యకార సమస్యలు, చెరువుల అభివృద్ధి, ఉపాధి అంశాలపై గడప దేవేందర్ గత కొంతకాలంగా చురుకుగా పనిచేస్తూ రావడంతో ఆయన ఎంపిక జరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు.ఈ సందర్భంగా గడప దేవేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు, జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
మెదక్ జిల్లాలో 311 మత్స్య సహకార సంఘాలు ఉండగా, వాటిలో 16,820 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. అలాగే 288 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 15,763 మంది సభ్యులు, 23 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 1,050 మంది మహిళా సభ్యులు ఉన్నట్లు వివరించారు. జిల్లాలో మొత్తం 1,728 చెరువులు, కుంటలు ఉండగా పోచారం, హల్దీ జలాశయాలు ఉన్నాయని తెలిపారు.కార్యక్రమంలో మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లేశం, శాఖ సిబ్బంది నరేష్, సంతోష్, శ్రవణ్‌తో పాటు పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు.