•తెలంగాణటీచర్స్ యూనియన్(TTU) డిమాండ్
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి29
ఆసియా ఖండంలోనే అత్యంత వైభవంగా నిర్వహించే గొప్ప జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 30,31 తేదీలలో సాధారణ సెలవులు ప్రకటించాలి అని తెలంగాణ టీచర్స్ యూనియన్ (TTU) రాజన్నసిరిసిల్ల జిల్లా శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి, ప్రధాన కార్యదర్శి దూస మధులు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలోని సబ్బండ వర్గాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ జాతరకు రాష్ట్రంతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివస్తారని తెలిపారు.సమ్మక్క–సారలమ్మ తల్లులకు మొక్కులు చెల్లించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు సాధారణ సెలవులు ప్రకటించటం సముచితం అని పేర్కొన్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా నిర్వహించే ఈ జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తీరు అభినందనీయమని అన్నారు.
అదేవిధంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సెలవులు ప్రకటించడమే కాకుండా, జాతీయ పండుగగా గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ రాజన్నసిరిసిల్ల జిల్లా శాఖ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.సమ్మక్క–సారలమ్మల పోరాట స్ఫూర్తితో తెలంగాణ సమాజం మరింత జాగృతం కావాలని ఆకాంక్షిస్తూ, ఆ తల్లులకు వినమ్ర వందనాలు తెలిపారు.