మనప్రజాప్రతినిధి రాజన్నసిరిసిల్ల
జనవరి,08:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలోని కేసీఆర్ నగర్ 6వ వార్డుకు చెందిన వేముల నాగేష్ అనే వ్యక్తి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆయనకు డయాలసిస్ శస్త్రచికిత్స అవసరమని తేల్చారు. ఇందుకు సుమారు 4 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని వైద్యులు సూచించారు.
సర్పంచ్ చొరవ, విప్ సానుకూల స్పందన
బాధితుడి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, ఈ విషయాన్ని 6వ వార్డు సభ్యులు కొండ భరత్, గుజ్జె మహేష్ మరియు కోట సతీష్లు స్థానిక సర్పంచ్ గడ్డం రచన మధుకర్ (చోటు) గారి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సర్పంచ్ వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి గడ్డం మధుకర్ తో కలిసి హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో ప్రభుత్వ విప్ & వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
బాధితుడి పరిస్థితిని వివరించగా, విప్ ఆది శ్రీనివాస్ గారు సానుకూలంగా స్పందించారు. నాగేష్ ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని, త్వరలోనే LOC (Letter of Credit) మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న తమ వార్డు వ్యక్తికి అండగా నిలిచిన ఎమ్మెల్యే గారికి, చొరవ చూపిన సర్పంచ్ మరియు నాయకులకు వార్డు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.