•ఆపరేషన్ స్మైల్ విజయవంతం-28 మంది బాలలకు విముక్తి •ఐసిడిఎస్–వైద్య శాఖ–ఎన్జీఓల సమన్వయంతో కార్యక్రమం •హోటళ్లు, ఇటుక బట్టీలు, గోదాములపై ఆకస్మిక తనిఖీలు. •వివిధ పనుల నుంచి పిల్లల విముక్తి – యజమానులపై కేసులు నమోదు
•అదనపు ఎస్పీ చంద్రయ్య
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,జనవరి13 :
జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు అదనపు ఎస్పీ చంద్రయ్య తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.గత 13 రోజుల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా వివిధ పనుల్లో నిమగ్నమైన 28 మంది బాలలను రక్షించి, వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు. రక్షించబడిన బాలలకు కౌన్సిలింగ్ నిర్వహించి, అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు వెల్లడించారు.18 ఏళ్లలోపు పిల్లలను పనుల్లో నియమించిన యజమానులపై ఇప్పటివరకు మూడు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇకపై కూడా హోటళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, గోదాములు తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయడానికి ఐసిడిఎస్, వైద్య ఆరోగ్య శాఖ, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని అదనపు ఎస్పీ చంద్రయ్య పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో డీడబ్ల్యూఓ లక్ష్మీ రాజాం, సీడబ్ల్యూసీ చైర్మన్ అంజయ్య, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.