మనప్రజాప్రతినిధి//
రాజన్న సిరిసిల్ల
జనవరి,10
జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల ప్రస్తుత కార్యకలాపాలను ఆరా తీసి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని ఎస్పీ హెచ్చరించారు.
నేరాలకు దూరంగా ఉంటూ, సత్ప్రవర్తనతో మెలిగే వారిని గుర్తించి, వారిపై ఉన్న షీట్లను తొలగించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఉక్కుపాదం మోపుతామని, బాధ్యులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
పోలీస్ అధికారులు సూచించిన సమయాల్లో స్టేషన్కు హాజరు కావాలని, నిబంధనలు అతిక్రమిస్తే వారిని బైండోవర్ చేస్తామని ఆదేశించారు.జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని కాపాడటమే పోలీసుల ప్రథమ ప్రాధాన్యత అని, ప్రజల జీవనానికి విఘాతం కలిగించే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా ఎస్పీ పునరుద్ఘాటించారు.