manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 31 January 2026, 8:07 am Editor : Mana Praja Prathinidhi

ప్రజా సమస్యలే నా అజెండా

గెలిపిస్తే మూడో వార్డుకు శాశ్వత పరిష్కారాలు-బూడిది జ్యోతి గోపి

•కాంగ్రెస్–సీపీఐ మద్దతుతో సీపీఎం అభ్యర్థి బూడిది జ్యోతి గోపి

15 ఏళ్ల ప్రజా పోరాట అనుభవంతో మూడో వార్డు అభివృద్ధికి హామీ
రోడ్లు, డ్రైనేజీ, వరద నివారణపై ప్రత్యేక దృష్టి – సీపీఎం అభ్యర్థి
•సుత్తి–కొడవలి–నక్షత్రం గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి
గెలిపిస్తే మూడో వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్న జ్యోతి గోపి

మనప్రజాప్రతినిధి//జనగామ.జనవరి31
జనగామ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీల మద్దతుతో మూడో వార్డులో పోటీ చేస్తున్న సీపీఎం పార్టీ అభ్యర్థి బూడిది జ్యోతి గోపి శుక్రవారం పార్టీ ‘బి’ ఫారంతో రెండో నామినేషన్‌ను దాఖలు చేశారు.ఈ సందర్భంగా బూడిది జ్యోతి గోపి మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికల్లో తనకు కేటాయించిన సుత్తి–కొడవలి–నక్షత్రం గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని మూడో వార్డు ప్రజలను కోరారు. వార్డులో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న రోడ్లు, మురికి కాలువలు, చెత్తాచెదారం నిల్వలు, పనిచేయని వీధిదీపాలు, వరదల సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక వసతుల సమస్యలను ప్రథమ ప్రాధాన్యంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.గత 15సంవత్సరాలుగా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న అనుభవంతో, ప్రజల తరఫున మున్సిపాలిటీ వేదికగా గళమెత్తి పోరాడతానని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా మూడో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని తెలిపారు.
ప్రజలు తనకు ఒక అవకాశం ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో మూడో వార్డును ఆదర్శవంతమైన వార్డుగా అభివృద్ధి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలే తన అజెండా అని, మాటలకంటే పనితోనే మార్పు తీసుకొస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, రిటైర్డ్ ఉపాధ్యాయులు బాల్నే విద్యాసాగర్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకురాలు పల్లెర్ల లలిత, మూడో వార్డు సీపీఎం శాఖ కార్యదర్శి గుండు శశిరేఖ, సీపీఎం నాయకులు గుండె మల్లేష్, మలిపెల వాణి తదితరులు పాల్గొన్నారు.