•పునరావృతమవుతున్న ఘటనలు… పాలకులు మౌనం
•గ్రామస్తుల భయాలు పట్టించుకోని యంత్రాంగం
మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.జనవరి24
తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని ఏర్పేడు గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం సృష్టించాయి. గ్రామంలోని యాదవ వీధికి చెందిన బొడుగు నరేష్కు చెందిన గొర్రెల మందపై గురువారం తెల్లవారుజామున సుమారు ఐదు గంటల సమయంలో వీధి కుక్కలు మూకుమ్మడి దాడి చేశాయి.ఈ దాడిలో సుమారు 8 నుంచి 10 గొర్రెల వరకు మృతి చెందాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో గొర్రెల యజమాని నరేష్ దిగ్భ్రాంతికి గురయ్యారు. గొర్రెల పెంపకమే జీవనాధారంగా కొనసాగుతున్న తమ కుటుంబానికి ఇది తీవ్ర నష్టమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల కాలంలో ఏర్పేడు గ్రామంలో వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై స్పందించిన గొర్రెల యజమాని బొడుగు నరేష్, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, అలాగే వీధి కుక్కలను తక్షణమే గ్రామం నుంచి తరలించి ప్రజలకు రక్షణ కల్పించాలని సంబంధిత అధికారులను కోరారు.