మనప్రజాప్రతినిధి//కొండపాకమండల.జనవరి10
2026–27 విద్యా సంవత్సరానికి గాను గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తహసిల్దార్ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.శుక్రవారం జగదేవ్పూర్ (కొండపాక) మండల సామూహిక భవనంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సవిత, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఆయన గురుకుల ప్రవేశాలకు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతికి నూతన ప్రవేశాలు, అలాగే 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాలల ప్రవేశాలకు జనవరి 21వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న పాఠశాల బోనాఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలన్నారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు రుసుం రూ.100 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.ఆధార్, పుట్టిన తేదీ వివరాలతో ఆన్లైన్లో లేదా మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఒక్కో దరఖాస్తుకు ఒక్క మొబైల్ నంబరు మాత్రమే చెల్లుబాటు అవుతుందని, ఒకే కుటుంబంలో ఇద్దరు విద్యార్థులకు దరఖాస్తు చేయాలంటే వేర్వేరు మొబైల్ నంబర్లు తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు.ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22, 2026న ఎంపిక చేసిన గురుకుల పాఠశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక విద్యార్థి స్థానంలో మరొకరి ఫొటో లేదా తప్పుడు వివరాలు సమర్పిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.