మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి1
కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో గురువారం నాడు 2026 సంవత్సరానికి సంబంధించిన కాలమానిని క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథ శర్మ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రంలో ఏడాది పొడవునా నిర్వహించనున్న వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలతో ఈ కాలమానిని రూపొందించినట్లు తెలిపారు. క్షేత్రంలో ప్రతి శుక్రవారం రాహు–కేతు దోష నివారణ, కుజదోష నివారణ కోసం రాహుకాలంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు.అలాగే ప్రతి నెల ఆర్ద్రా నక్షత్రం రోజున సంతాన పాశుపత హవనం, ప్రతి పౌర్ణమి నాడు నవావరణ హవనం, మాస శివరాత్రి సందర్భంగా ప్రతి నెల సంతాన మల్లికార్జున స్వామికి అన్నపూజ నిర్వహిస్తామని పేర్కొన్నారు.మహా శివరాత్రిని పురస్కరించుకొని మూడు రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు, శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.కార్తీక శుద్ధ సప్తమి రోజున శ్రీ విజయదుర్గా దేవి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి అష్టోత్తర శత కలశాభిషేకం, వసంత పంచమి పర్వదినాన అమ్మవారికి విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహిస్తామని వివరించారు.ఈ కార్యక్రమంలో మర్పడగ గ్రామ సర్పంచ్ ఆకారం బాలరాజు, రాంపల్లి గ్రామ సర్పంచ్ మల్లేశం, మాజీ సర్పంచులు రమణారెడ్డి, సురేందర్ రెడ్డి, క్షేత్ర నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శించడంతో ఆలయం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.