(మనప్రజాప్రతినిధి)జహీరాబాద్.జనవరి 4
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై. నరోత్తం కార్యాలయంలో జనవరి 3వ తేదీ 195వ సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చదువుల తల్లి, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.జయంతి వేడుకలలో భాగంగా వై. నరోత్తం సతీమణి, ఉపాధ్యాయురాలు వై. పుష్పరాణిని శాలువలతో సత్కరించి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై. నరోత్తం మాట్లాడుతూ,సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న మహారాష్ట్ర రాష్ట్రం సతారా జిల్లా నయగావ్ గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారని, ఆమె 1840లో జ్యోతిరావు పూలేతో వివాహం చేసుకున్నారని గుర్తు చేశారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్రలో నిలిచిన సావిత్రిబాయి, తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి 1848 జనవరి 1న పూణేలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించి మహిళా విద్యకు బాటలు వేశారని తెలిపారు.మహిళల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన సావిత్రి బాయి పూలే స్ఫూర్తిని యువత, మహిళలు ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు, మహిళలు, స్థానికులు పాల్గొని సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించారు.